సకల ప్రాణులు బాబా ప్రతిరూపాలు అనే విషయం నిరూపిస్థాయి క్రింది బాబా లీలలు .
ఏటా కొన్ని నెలలు శ్రీమతి ఖాపర్దే శిరిడీలో వుండి, నిత్యమూభోజనం బాబా కు నివేదించేది. ఆమె అప్పుడప్పుడూ ఆయనను తన యింటికి భోజనానికి ఆహ్వానించేది. కొద్దిరోజులాయన నవ్వి వూరుకున్నారు.రెండుసార్లు వస్తానన్నారు ,,కానీ రాలేదు.ఆ తర్వాత రోజు ఆమె వంటచేస్తూంటే ఒక కుక్క వాసనబట్టి యింట్లో జొరబడింది. అది వంటకాలను తాకుతుందన్న తొందరలో ఆమె పొయ్యిలోని కట్టెతీసి దానిపై విసిరేసరికి ఆ కుక్క పారిపోయింది. తర్వాత ఆమె మసీదుకు నైవేద్యం తీసుకుపోగానే “బాబా, “నేను వస్తే మండుతున్న కట్టె నాపై విసురుతావా?” అన్నారు. మొదట ఆమె నివ్వెరబోయింది గాని, తర్వాత వాస్తవం తెలుసుకున్నది.
ఉబ్బసంతో బాధ భరించలేక హంసరాజ్ సతీసమేతంగా శిరిడీలో కొద్దికాల మున్నాడు. బాబా కృపవలన వ్యాధి తగ్గిందిగాని, సాయి అతనిని పుల్ల పెరుగు సుతరామూ తినవద్దన్నారు. కాని అతడు మూర్ఖించి భార్యచేత రోజూ పాలు. తోడు పెట్టించేవాడు. ఆ విషయం బాబాతో చెప్పనివ్వలేదు. అదేమి చిత్రమోగాని, రోజూ ఆ యిద్దరూ హారతికివెళ్ళి వచ్చేలోగా ఒక పిల్లి ఆ పెరుగు త్రాగిపోయేది. ఒకరోజతడు కోపంతో ఆరతికి గూడ వెళ్ళక, పొంచివుండి, పిల్లివచ్చి పెరుగు తాకగానే, కర్రతో కొడితే పారిపోయింది. తర్వాత అతడు మసీదుకు వెళ్ళగానే బాబా, “ఇక్కడొక మూర్ఖుడు పుల్ల పెరుగు తిని చావాలని చూస్తున్నాడు. కాని రోజూ అతను తినకుండా చూస్తున్నాను. వాడు నన్నీరోజు కర్రతో కొట్టాడు!” అన్నారు. సాయి ఒకవంక భక్తులను రక్షిస్తూ, మరొకవంక వారినుండి తిట్లు, దెబ్బలు భరించవలసివచ్చేది. ఒకసారి నానాసాహెబ్ డెంగలే రుచికరమైన వంటకాలు వెండి పళ్ళెం లో వుంచి బాబాకు అర్పించాడు. ఆయన చప్పట్లు చరిచారు. వెంటనే, ఒక నల్లకుక్క వచ్చి వాటిని తింటోంది.. అదిచూచి,అతడు మనసులో అసహ్యించుకున్నాడు.వెంటనే బాబా ఆ పళ్ళెం తోసేసి, “దీనిని నీవే తీసుకో, నాకొద్దు!” అన్నాడు.
కావున మనం ఏ ప్రాణి ని అసహ్యించుకున్నా మన ప్రియతముడయినా బాబా ని అసహ్యించుకున్నట్లు అవుతుందనే సత్యాన్ని మనం మర్చిపోవద్దు.
ఒకసారి శిరిడీ వాస్తవ్యులొకరు ఒక కోడెదూడకు నొసట త్రిషుల ముద్ర వేసి, శివుని పేర ఆబోతుగా విడిచారు. కొంతకాలానికి అది ఎదిగి, పైర్లను పాడుచేస్తోంది. శివుని ఆబోతని ఎవరూ దానిని దండించేవారుగాదు. ఊరి పెద్దలంతా కలసి దానిని బందిల దొడ్డిలో వుంచి, తమ ఖర్చుతో దానిని పుష్టిగా మేపాలని నిర్ణయించి, ఒక నెలఖర్చు యిచ్చి ఒక మార్వాడి తో దానిని యేవలాకు పంపారు. సాయంత్రానికి అతడు శిరిడీవచ్చి ఆ కార్యం నెరవేర్చానన్నాడు. మరుసటి తెల్లవారుఝామున గ్రామంలో ఒక భక్తునికి సాయి మూడుసార్లు స్వప్నంలో కన్పించి, “నన్ను రహటాలో ఒక కసాయి ముంగిట్లో కట్టేసారు. వెంటనే వచ్చి విడిపించు” అన్నారు. తెల్లవారాక అతడాశ్చర్యంతో యేవలా వెళ్ళి విచారిస్తే నిజంగానే మార్వాడి ఆబోతును రూ. 14/- లకు ఒక కసాయికి అమ్మేసినట్లు తెలిసింది. అప్పుడతడు దానిని విడిపించి, బందిలదొడ్లో అప్పగించి, శిరిడీ వచ్చి గ్రామ పెద్దలకు ఫిర్యాదు చేసాడు. పెద్దలు మార్వాడీకి శిక్ష విధించారు.
ఒకరోజు సాయి పోళీలు కావాలంటే నానాచందోర్కర్ స్వయంగా వండి వాటిని నివేదించాడు. సాయి వాటిని తాకనైనా తాకకుండా కూర్చున్నారు. వాటిమీద ఈగలు, చీమలు చేరాయి. అపుడు సాయి నానాతో, “నేను ఆరగించాను. నీవు తీసుకో!” అన్నారు. నానా ఎంతో నిరుత్సాహపడి, అలిగి అన్నంగూడ తినకుండా చావట్లో పడుకున్నాడు. సాయి అతనిని పిలిపించి, “నానా, 18 సం లు నా దగ్గరుండి నీవు గ్రహించినదిదేనా? ఆ చీమలు, ఈగల రూపంలో నేనే ఆరగించాను. నీవు ప్రసాదం తీసుకో!” అన్నారు. “వాటి రూపాలలోనూ మీరే ఆరగించారని నాకు ఋజువేమిటి?” అన్నాడు నానా. బాబా వెంటనే ఒక భంగిమ చేశారు. తనకు తప్ప మరెవ్వరికీ తెలియని తన జీవిత రహస్యం బాబాకు తెలుసునని అతడు గ్రహించాడు. తన హృదయంలోలాగే అన్ని జీవులలోనూ బాబాయే వున్నారని నానాకు అర్ధమై ప్రసాదం తీసుకున్నాడు.
నిజానికి జడమైన వస్తువులుగూడ బ్రహ్మమే. అన్ని ప్రాణుల్లోనూ బాబా ని ఈ రోజటి నుండి దర్శిద్దాము . సాయి సన్నిధి ని మది నిండా నింపుకుందాము.
జయ్ సాయి నాధా !
సేకరణ : శ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ గారి కృపాశీస్సులతో