సాయిరాం, ఒక పేరు తెలియని సాయి భక్తుడి అనుభవం ..వారి మాటల్లోనే ..
“పోలీసు డిపార్టుమెంటులో అడిషనల్ సూపరింటెండెంట్గా చేసి 1977 సం లో రిటైరయినాను.. 1960 సం నుంచి గుండెజబ్బుతో బాధపడుతున్నాను. పేరుపొందిన వైద్యనిపుణులకు చూపించడమైంది. వారందరూ కూలంకషమైన పరీక్షలు చేసి Aortic stenosis with regurgitation అని నిర్ధారణ చేసినారు. అనగా అయోటిక్ వాల్వు సన్నపడి, కావలసినంత రక్తము గుండెకు సరఫరా కావటము లేదని అందువలన తరచు గుండెనొప్పి వచ్చుచున్నదని నిర్ధారణ చేసినారు. ఎంతో అనుభవముగల వైద్యనిపుణులు ECG (ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్), ఎక్స్ రే మొదలైన ఆధునిక పరీక్షలు చేసినారు. ఈ వ్యాధి పూర్తిగా తగ్గాలంటే గుండె ఆపరేషన్ చేసి ఇప్పుడున్న వాల్వును తీసి కొత్త వాల్వు పెట్టవలయునని అంతకు మించి వేరే మార్గం లేదని సలహా యిచ్చారు. నాకు తరచు గుండెనొప్పి వస్తూ కావలసిన రక్తముగుండెకు, మెదడుకు సరఫరా కానందున రెండు మూడు రోజులు స్పృహ లేకుండా ఉంటూ ఉండేవాడిని. నాకు వయస్సు మళ్ళినందువలన హార్టు స్పెషలిస్టులు సలహా యిచ్చినప్పటికీ నేను ఆపరేషన్ చేయించుకొనుటకు యిష్టపడక బాధను అనుభవించుచూ కాలంగడుపుతుంటిని.
నా వియ్యంకుడుగారైన డాక్టరు ఎ. ప్రభాకరరావు (గవర్నమెంటు హాస్పిటల్ – సూపరింటెండెంటు)గారి ప్రోద్బలముతో 1980 సం లో మొదటిసారి, రెండవ పర్యాయము 1982 సం లో నా కుటుంబముతో షిరిడీ వెళ్ళాను. మందిరములో శ్రీసాయి విగ్రహము చూచాక నాకు ఏదో అలీతస్థితిలో ఉన్నట్లు తోచినది. అనేక భావములు కలిగినవి ఈ భావాలు ఒక చిత్రమైన అనుభూతిగా నా హృదయములో హత్తుకొని పోయినవి.
అప్పటినుండి శ్రీసాయిచే ఆకర్షింపబడి శ్రీసాయినే నాదైవముగా యెంచి నిత్యము ప్రార్థించుట మొదలుపెట్టాను. శ్రీసాయి నా పూజ్య దైవము. ఆయన తన భక్తులను ఎల్లప్పుడూ ఆదుకుంటూ వుంటారని, పిలిచిన పలికెడి దైవమని నమ్మి వారిని ప్రతినిత్యము ధ్యానముచేస్తూ ఉన్నాను. నాకు కలిగిన అనుభవములను కొన్ని యిక్కడ పేర్కొనెదను.
1983 సం సెప్టెంబరు నెలలో తీవ్రమైన గుండెనొప్పి వచ్చి రెండు రోజులు స్పృహ లేకుండా ఉన్నాను. ఈ విధంగా ఎప్పుడు వచ్చినా Pulse rate పడిపోయి ఒక్కొక్కసారి 40కి కూడా వస్తుంది. ఈ సారి గూడా ఆ విధంగానే ఉండింది. మూడవ రోజు రాత్రి అనగా సెప్టెంబరు 20వ తేది తెల్లవారుఝామున 3 గంటల ప్రాంతములో నా కొక స్వప్నము కలిగింది. ఆ స్వప్నములో ఒక ఫకీరు నా నుదుట ఊధీ పెట్టినట్లు, నా బాధ తగ్గిపోతుందని చెప్పినట్లు అనిపించింది.
అంతకుముందు రెండురోజులు నుండి లేవలేని స్థితిలోవున్న వాడిని వెంటనే మంచం మీద నుండి లేచి నా భార్యను లేపి, నా స్వప్న వృత్తాంతము చెప్పి, నా నుదుట విభూతి వున్నదేమో చూపమని అడిగాను. విభూతి బొట్టు నానుదుట వుండుట చూచి అందరము ఆశ్చర్య ఆనందాలతో ఉక్కిరి బిక్కిరి అయినాము. నా కలలో కనబడిన ఫకీరు నిస్సందేహముగా శ్రీ సాయిబాబాయే అని నా నమ్మకము. అప్పటినుండి యీనాటివరకు మళ్ళీ గుండె నొప్పి రాలేదు. అంతేకాక 16-1-1983 ఏకాదశి నాటిరాత్రి సుమారు 8గం.లకు నేను యథాప్రకారముగా సర్వ సమర్థుడైన శ్రీసాయి నాథుని ధ్యానిస్తూ వుండగా అకస్మాత్తుగా శ్రీసాయి పటమునుండి ఒక కాంతిపుంజము నా గుండెమీద పడినది. ఆ కాంతి ప్రభావము వలన నా శరీరములో విద్యుత్ ప్రసారము కలిగినట్లు అనుభూతి కలిగింది.
వెంటనే చూచుకొంటే నా గుండె ఎడమ భాగాన అరంగుళము పైన వెడల్పుతో, మూడు అంగుళాల వ్యాసంతో వలయాకారముగా చర్మము కాలినట్లు ఎర్రటి మచ్చపడి వుంది. దానివల్ల నాకు ఏవిధమైన మంటకాని బాధకాని అన్పించలేదు. ఆ కాలినమచ్చ ఈ రోజువరకు నా శరీరము మిద గుండెకు ఎడమవైపున ముద్రగా వున్నది. ఈ అనుభవము కలగక ముందు నా గుండె ఎల్లప్పుడూ ఎంతో బరువుగాను, పట్టివేసినట్లుగా, గుండె మీద ఒక పెద్దరోలరు పెట్టినట్లుగా బాధగావుండేది. ఇది జరిగిన తరువాత గుండె బరువుతగ్గి ఎంతో తేలికపడినట్లు అన్పిస్తున్నది. ఈ అనుభూతి కలిగినప్పటి నుండి శస్త్రచికిత్స చేయకుండానే బాధ నివారణ జరిగినట్లు అన్పిస్తున్నది. అప్పటి నుండి ఆరోగ్యవంతుడినై తిరగగలుగుతున్నాను. నేను వ్యాధి నుండి బయటపడుట మహాద్భుతమని నిపుణులైన వైద్యులే చెప్పినారు.
ఇది ఒకఅనిర్వచనీయమైన అనుభవము. ఈ అనుభవం వలన నా శరీరతత్వములో పూర్తిమార్పు వచ్చినది. చాలా దృఢమైన ఆరోగ్యము కలిగినది. నా మనస్సులో షిరిడీలోని శ్రీసాయి సమాధి విగ్రహము స్పష్టముగా ముద్రపడినది. శ్రీసాయి సమాధి దర్శనముచేతనే నాకిటువంటి స్వస్థత, శాంతి, ఆనందము లభించినవి. శ్రీసాయిని దైవముగా కొలచిన వారికి శ్రీసాయి తప్పక సహాయము చేయును. ఎవరికి ఏది? చేయవలెనో అది సర్వజ్ఞుడైన ఆయనకే బాగా తెలియును. ఈ విషయమును మాటలతో ఎంత చెప్పినను చాలదు.”
సేకరణ: శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారి కృపాశీస్సులతో
