గురుదేవుల భక్తి (శక్తి)
ఒకనాడు హైదరాబాద్ నుండి ఢిల్లీకి నాకు ఫోన్ చేసి గురువుగారు శ్రీ అమ్ముల సాంబశివరావుగారు- “భాస్కర మూర్తి గారూ మనది 100వ యజ్ఞం ఏలూరులో జరుగుతున్నది. ప్రత్యేకముగా 100 అడుగుల ఎత్తులో నిర్మించబడిన సాయికోటి మహాస్తూపములో సాయి నామాలు నిక్షిప్తం చేసాము. ఈ యజ్ఞంతో 100 ప్రదేశాలలో 200 కోట్ల సాయినామాలు నిక్షిప్తం చేసినట్టు అవుతుంది. కనుక మీ దగ్గర ఢిల్లీలో కూడా ఏమైనా సాయి నామాలు వ్రాసిన పుస్తకాలు ఉంటే త్వరగా కలెక్టు చేసి పంపండి” అని చెప్పారు.
నేను “గురువుగారికి పుస్తకాలు అవసరం కాబోలు, ఎలాగైనా త్వరగా కలెక్ట్ చేసి పంపాలి అని అనుకున్నాను. నా ఉద్దేశ్యము ప్రకారము ఇక్కడ 50 లేక 100 పుస్తకాలు ఉండవచ్చు. కానీ గురువు గారికి చాలా పుస్తకాలు అవసరమై ఉండవచ్చు. లేని యెడల వారు స్వయంగా ఫోన్ చేయరు. మన ప్రయత్నం మనం చేద్దాము. ఎన్ని పుస్తకములు దొరికితే అన్ని పంపుదాము” అనుకున్నాను.
సరిగా అప్పుడే ఫరీదాబాద్ వాస్తవ్యులు సాయి బంధువులు శ్రీ బసేగారు, శ్రీ గుప్తా గారు నాకు ఢిల్లీకి ఫోన్ చేసి “మా బేస్మెంట్ అంతా సాయినామములు వ్రాసిన పుస్తకములతో నిండిపోయి ఉంది, అవి ఏం చేయాలో తోచడం లేదు. మీరు మీ ఖర్చులతో తీసుకొని వెళ్ళగలరు” అని చెప్పారు.
వెంటనే నేనూ, రవి వెళ్ళి ఆ పుస్తకాలను బస్తాలుగా ప్యాక్ చేశాము. అవి 70 పెద్ద బస్తాలు అయినవి. ఇప్పుడు వాటిని హైదరాబాద్ గురువుగారికి చేర్చాలి. ఎంత ఖర్చు అవుతుందో? అంత ఖర్చుతో ఎలా చేర్చాలో అనుకుంటుండగా ఎకనామిక్ ట్రాన్స్ పోర్ట్ ఆరనైజేషన్ జనరల్ మేనేజర్ సాయి భక్తులు శ్రీ జిందాల్ గారు అవి వారి ట్రాన్స్ పోర్టు ద్వారా ఉచితంగా పంపే ఏర్పాటు చేశారు. తరువాత కూడా వారి వద్ద నుండి 60 బస్తాలు ఒకసారి 40 బస్తాలు మరొకసారి సాయి నామ లిఖిత పుస్తకాలు తీసికొని గురువు గారికి హైదరాబాద్ పంపడం జరిగినది. వాటిని ప్రవీణ్, బాలాజీ ప్రింటర్స్ వారు ప్యాక్ చేసి ఇస్తే రావు ట్రావెల్స్ (ఢిల్లీ) వారు ట్రాన్స్ పోర్టు ఆఫీసుకు చేర్చేవారు.
ఒకసారి ఏవో కారణాల వల్ల ఆ తరువాతి 40 బస్తాలు సాయి నామములు ఉచితంగా పపటం ట్రాన్స్ పోర్టు వారికి కష్టం అయ్యింది. సుమారుగా 4000 రూపాయలు పూజ్యగురుదేవులు శ్రీ అమ్ముల సాంబశివరావుగారు చెల్లించాలి అని వారు చెప్పటం జరిగింది. 40 బస్తాలు పుస్తకాలు ట్రాన్స్ పోర్టు ఆఫీసు బయట పడవేసి ఉన్నాయి.
సరే గురువుగారి నడిగి వారు ఏమి చేయమంటే అదే చేద్దాము అని హైదరాబాద్ వారింటికి ఫోన్ చేస్తే వారు యజ్ఞ కార్యక్రమములలో చాలా బిజీగా పర్యటిస్తున్నట్లు తెలిసింది.
నాకు అంత డబ్బు చెల్లించి పంపే స్తోమత లేదు, పోనీ ఎవరి వద్దనైనా డబ్బు సాయంగా తీసుకుందామా అంటే – గురువుగారు సాయిబాబా పేరు మీద ఏ విధమైన డబ్బు వసూలు చేయకూడదు అన్న షరతుతో నాకు శ్రీ షిరిడీ సాయిబాబా సేవాశ్రమము ఢిల్లీ విభాగపు ప్రెసిడెంట్ పదవి ఇవ్వటం జరిగినది.
సరే, ఏమయితే అయ్యింది అని గురువుగారిని అడిగి వారు ఏమి చేయమంటే అదే చేద్దాము అని ఊరుకున్నాను. సుమారుగా 12,13 రోజులు గడచినాయి. గురువు గారు దొరకటం లేదు. ఒకరోజు వాతావరణం మబ్బుగా ఉండి వర్షం పడేటట్లుగా ఉన్నది. ట్రాన్స్ పోర్టు ఆఫీసు బయట ఉన్న సాయిబాబా వారి పుస్తకములు తడిసిపోతాయేమో అనే ఉద్దేశ్యంతో, వాటిని తడవకుండా జాగ్రత్తగా పెట్టండని వారికి ఫోన్ చేస్తే వారు ఇలా సమాధానమిచ్చారు.
“మీ పేరు చెప్పి 10 రోజుల క్రితమే సాయినామ పుస్తకాలన్నీ ‘టు పే’ (డబ్బులు హైదరాబాద్లో కట్టే విధంగా)లో హైదరాబాద్ పంపమని ఎవరో చెప్పారు. అప్పుడే పంపివేసినాము. అవి హైదరాబాద్ చేరిపోయినవి కూడా మీరు వచ్చి రశీదులు తీసుకువెళ్లండి” అన్నారు. నేను ఆశ్చర్యంతో వారి ఆఫీసుకు వెళ్ళి విచారించగా “ఎవరో మూర్తిగారు పంపమన్నారు’ అని పుస్తకములు పంపిన లారీ రశీదులు అందించారు. సాయి కరుణకు నా హృదయం ద్రవించి కళ్ళు నీళ్ళతో నిండినవి. పంపమన్న ఆ మూర్తిగారు ఎవరో ఇప్పటికీ తెలియలేదు.
గురువుగారు కాకినాడలో ఉన్నారని తెలిసి పుస్తకములు పంపిన విషయం , 4 వేల రూపాయలు కట్టి అవి విడిపించుకోవాలి అని ఫోన్ చేయగా గురువు గారు “4 వేలు ఖర్చు అయినా ఫరవాలేదు, వాటిని జాగ్రత్తగా పంపారు. ఆ సాయి నామములు మనకు కోట్ల రూపాయలకన్నా విలువైనవి” అన్నారు.
ఇంతటి వారి భక్తికి సాయి శక్తి తోడు గాకుండా ఉంటుందా! అదే ఈ లీల. నామముల పుస్తకములు ఏమైనా ఉంటే కలెక్టు చేసి పంపండి. అని గురువుగారు పోన్ చేసే సమయానికి అసలు ఇక్కడ పుస్తకములు లేవు. వారు ఫోన్ చేసిన నాటినుండి నేటి వరకు లారీల కొద్దీ పుస్తకములు లభించడం అవి గురువుగారికి అందించడము అంతా సాయి దయ కాక పోతే ఇంకేమిటి. పూజ్య గురుదేవులు నిర్వహించే సాయి కోటి యజ్ఞానికి అవసరమయ్యే సాయి కోటి పుస్తకాలను అందించే ఏర్పాటు చేయడమే కాకుండా వాటిని స్వయంగా చేరవేసింది సాయి నాధుడే.. ఇదే గురుదేవుల భక్తి కి గల శక్తి.
జై సాయిరాం !
శ్రీ భాస్కర మూర్తి గారు
శ్రీ షిరిడి సాయిసేవాశ్రమం ప్రెసిడెంట్
ఢిల్లీ

OM SAI SRI SAI JAYA JAYA SAI
LikeLike
Jai sairam
LikeLike