
బాబా తో రఘువీర పురంధరే యొక్క అనుభవాలు :
దాసుగణు చెప్పిన హరికథ లో బాబా గురించి విని రఘువీర పురంధరే షిరిడి వెళ్లాలని ఉవ్విళ్లూరుతుంటారు.
దానికి తగ్గట్లే, ఒకనాడు బాబా అతడికి కలలో కనిపించి షిరిడి రమ్మని చెప్పారు. కానీ అతడి పసిబిడ్డ కి సుస్తీ చేయడం వల్ల పసిబిడ్డ ని తీసుకుని అంత దూరం షిరిడి ప్రయాణం చేయించడం మంచిది కాదని అతని తల్లి చెప్పింది. కానీ అతడు బాబా పై పూర్ణ విశ్వాసముంచి పట్టుదల గా ఆరోజు నే షిరిడి బయల్దేరాడు. చివరికతడి విశ్వాసమే నెగ్గింది. వాళ్ళు షిరిడి చేరిన మూడవ రోజు కి బిడ్డ ఆరోగ్యం చక్కబడినది .
తర్వాత విషయాలు పురంధరే మాటల్లో..” తర్వాత నేను బాబా ను దర్శించగానే బాబా నన్ను ” శాల కి పో ” అన్నారు.శాల అంటే రాధా కృష్ణమాయి ఇల్లు అని దీక్షిత్ చెప్పాడు.నేనెక్కడికి వెళితే ఆమె తలుపు తీయకుండానే నేను ఎవరో, ఎందుకొచ్చానో వివరాలడిగింది కానీ నన్ను లోపలకి రానివ్వలేదు. నేను పది నిమిషాలు వేచి చూసి తిరిగి మశీదు కి వెళ్ళాను. నేనావిషయం చెబితే ఆయన నన్ను మల్లి వెళ్లమన్నారు. నేను వెళ్లేసరికి ఆమె తలుపు తీసి నా కాళ్ళ మీద పడి ఏడుస్తున్నది. ఆమె స్వభావం అర్థం కాక నేను తికమక పడ్డాను..కానీ ఆరోజు నుండీ ఆమె నన్ను తల్లి లా ప్రేమించి నా చేత బాబా సేవ చేయించింది.”
పురంధరే భార్య కి కలరా వచ్చి వైద్యులు ఆశలు వదులుకున్నప్పుడు వారి ఇంటి ఎదుట వున్న దత్త మందిరం ముందు సాయి దర్శనమిచ్చి ఆమెకి ఊది, తీర్థం ఇవ్వమన్నారు. వాటినివ్వగానే ఆమె కోలుకున్నది.
పురంధరే సొంత ఇల్లు కట్టుకోవాలని బాబా సూచించినా కూడా పురంధరే నిరాసక్తత తో ఉంటాడు. అపుడు బాబా షిరిడివచ్చినప్పుడల్లా అతడిని బలవంతపెట్టేవారు ఇల్లు కట్టుకొమ్మని, చివరికి రాళ్లు కూడా రువ్వేవారు .అయినా అతను వినలేదు .ఇక పురంధరే క్షేమం కోసం ఇల్లు కట్టుకోమన్నా వినడం లేదని బాబా అతనికి శిక్ష విధించాడు. బిడ్డ క్షేమం కోసం తల్లి చెప్పిన పని చేయని బిడ్డ ని ప్రేమతో దండించి మరీ బిడ్డ చే ఆ పని చేయించే తల్లి లా బాబా పురంధరే ని శిక్షించారు. అతడికి రాత్రిపగళ్ళు తలలో నరాల పోటు రాసాగింది. అపుడు బాబా “ఇల్లు కట్టుకున్నాకే నిన్న బాధ విడిచిపెడుతుంది ” అన్నారు.విధి లేక పురంధరే తన ఆఫీస్ లో అప్పు తీసుకుని ఇల్లు కట్టుకుని గృహ ప్రవేశం చేశాకే అతడి బాధ మాయమయింది.
పురంధరే ఇంకా ఇలా చెప్పాడు “ఒకసారి మా ఆఫీస్ లో సెలవు లభించింది. షిరిడి వెళ్ళడానికి మా అమ్మ కూడా అనుమతిచ్చింది.. కానీ నేను బయల్దేరదలచిన ముందటి రాత్రి బాబా స్వప్నం లో కనిపించి, “నువ్వు రావద్దు. వచ్చావో కొడతాను జాగ్రత్త..మాటిమాటికీ ఎందుకిక్కడికి పరిగెత్తుకొస్తావు? నువ్వెక్కడున్నా నేను నీ చెంతనే వున్నాను ” అన్నారు.ఆయన అలా ఎందుకన్నారా అని ఆశ్చర్యపోయాను. ఆ ముందురోజే మా కార్ఖానా లో సమ్మె జరిగింది. నేననుకున్న ప్రకారం నేను షిరిడి వెళ్ళిపోయి ఉంటే, సమ్మె కి నేనే కారణమని తలచి అధికారులే నాపై చర్య తీసుకునేవారే”…”యశ్వంతరావు అను ఇంజనీరు ఒక గురుపూర్ణిమ కి షిరిడి కి వచ్చాడు నాతో పాటు. కానీ బాబా అతడిని మాత్రమే తిరిగి వెళ్ళమని ఊది ఇచ్చాడు. కానీ అతడు నన్ను విడిచి వెళ్లడం ఇష్టం లేక నేనెంత చెప్పిన వెళ్ళలేదు. ఆరోజు రాత్రి అతడికి కలరా వచ్చి మరుసటి ఉదయమే చనిపోయాడు. అతడి ని రాగల ప్రమాదం నుండి తప్పించడానికి బాబా ఆదేశమిచ్చినా అతడి పాటించలేక పోయాడు.”
ఒకారోజు చావడి ఉత్సవం పూర్తయ్యాక పల్లకి ని మశీదు బయట ఉంచడం జరిగింది..అపుడు దొంగలు దానికున్న వెండి సింహాలను ఎత్తుకెళ్లారు. అపుడు పురంధరే బాబా వారిస్తున్నా వినకుండా పల్లకి ఉంచడానికి ఒక షెడ్డు నిర్మిస్తాడు.. నేడు ద్వారకామాయి లో రథాన్ని ఉంచుతున్న గది ఆనాడు పురంధరే నిర్మించినదే.
