బాబా భక్తుడు-యం.బి. రేగే

23783479_10214770569767756_7743795405494844696_o

బాబా భక్తుడు-యం.బి. రేగే

ఇందోర్ హైకోర్టులో జడ్జిగా పనిచేసి రిటైరయిన యం.బి. రేగే బాబా ప్రీతికి పాత్రుడైన భక్తుడు. ఇతడు చిన్నప్పటినుండి తీవ్రమైన ఆధ్యాత్మిక చింతన గలవాడు. బాల్యంనుండి యితడు గోవాలోని శాంత దుర్గాదేవిని యిష్టదైవంగా పూజించుకుని ధ్యానించుకునేవాడు. ఇతడు 8వ సంలో,ఉపనయనమయినప్పటినుండి అతడు ఆసన, ప్రాణాయామాలతో పాటు సూర్యుని బింబము, మధ్యలో శ్రీమన్నారాయణుడున్నట్లు ధ్యానిస్తూండేవాడు.

అతనికి ఒకే రాత్రి మూడు కలలు వచ్చాయి : 1) అతడు తన శరీరము విడివడి, ఎదుట శ్రీమన్నారాయణుని చూస్తున్నాడు. 2) ఈసారి శ్రీమన్నారా యణుడు తన ప్రక్కనున్న ఒక వ్యక్తిని చూపి, ‘ఈ శిరిడీ సాయి నీవాడు. ఆయననాశ్రయించు’ అన్నారు. 3) అతడు గాలిలో తేలి ఒక గ్రామం చేరాడు. ఒక వ్యక్తి కన్పించి అది శిరిడి అని చెప్పి, అతనినొక మశీదుకు తీసుకెళ్ళాడు. అక్కడ సాయి కాళ్ళు చాపుకొని కూర్చొని వున్నారు. అతడు నమస్కరించగానే లేచి, అతనిని కౌగిలించుకొని, “నీవు నా దర్శనానికి వచ్చావా? నేనే నీకు ఋణపడ్డాను; నేనే నీ వద్దకు రావాలి’ అని అతనికి నమస్కరించారు.

తర్వాత కొంతకాలానికి అతడు శిరిడీ వెళ్ళి బాబాకు నమస్కరించగానే ఆయన, “అరే! మనిషిని పూజించడమేమిటి?’ అని అతని సంశయము పైస్వప్నంలోలాగ తనను దగ్గరకు తీయలేదని నిరాశ చెంది, మధ్యాహ్నం బాబా ఒక్కరే వున్నప్పుడు ఆయనను దర్శించాడు రేగే. ఆయన అతనిని కౌగిలించుకొని, “నీవు నా వాడివి. కొత్తవారి ఎదుట బిడ్డలను దగ్గరకు తీయము” అన్నారు. అతని కల నిజమైంది. ఇష్టదైవం అతనికి సద్గురువును చూపాడు! అతని ఆనందానికి అవధులు లేవు.

మరొకసారి అతడు 1915లో రామనవమికి ఒక మస్లిన్ గుడ్డ తీసుకొని శిరిడీ చేరాడు. సహజంగా బాబా భక్తులిచ్చే గుడ్డలు ప్రసాదంగా తిరిగి వారికే యిచ్చే సేవారు. కాని తానిచ్చే గుడ్డను వారే వుంచుకోవాలనుకొని రేగే దానిని రహస్యంగా వారి ఆసనం క్రింద పెట్టాడు. బాబా అందరిచ్చిన గుడ్డలు తిరిగి యిచ్చివేసి, లేచి నిలబడి, ఆసనం దులిపివేయమన్నారు. అపుడు కన్పించిన ఆ మస్లిన్ ను తీసి కప్పుకొని, “ఇది నాది! నేను కప్పుకొంటే బాగుండలేదూ?” అని అతనికేసి చూచి నవ్వారు. అలాగే ఒక గురుపూర్ణిమనాడు భక్తులందరూ బాబాకు మాలలు వేస్తున్నారు. తానేమీ తీసుకురాలేదని రేగే నొచ్చుకుంటుంటే బాబా తన మెడలోని మాలలన్నీ అతనికి చూపి, “ఇవన్నీ నీవే!” అన్నారు.

ఒకనాటి మధ్యాహ్నం రేగేను మశీదుకు పిలిపించి, బాబా ప్రేమగా “నా ఖజానా తాళంచెవి నీ చేతిలో పెట్టాను, ‘నీకేమి కావాలో కోరుకో, యిస్తాను!” అన్నారు. davరేగే

రేగే వివేకంతో , “అన్ని జన్మలలోనూ మీరు నాకు తోడుండాలి!” అన్నాడు. ఆయన, “తప్పక వుంటాను” అని సంతోషంతో అతని వీపు తట్టారు. నాటినుండి అతనికెప్పుడూ బాబా తన దగ్గరున్నట్టే వుండేది. అతని బిడ్డ చనిపోయినప్పుడు రేగే ఎదుట సాయి ప్రత్యక్షమై, “నీకు నేను కావాలా, బిడ్డ కావాలా? బిడ్డ కావాలంటే బ్రతికిస్తానుగాని, మనకెట్టి సంబంధమూ వుండదు. నీకింకా బిడ్డలు కలుగుతారు” అన్నారు. “మాకు మీరే కావాలి?” అన్నాడు రేగే. “అయితే దుఃఖించకు!” అని బాబా అదృశ్యమయ్యారు.

రేగేకు సాయి అనుగ్రహం యింతగా వర్షించడానికి కారణం ఈ జన్మకు సంబంధించినదిగాదు. అతడు రత్నగిరి జిల్లాలోని సాహిబాబ్ గ్రామంలో జులై 5,1888 యోగినీ ఏకాదశినాడు జన్మించాడు. బిడ్డ పుట్టిన ఆరవరోజున ఆ పడక ప్రక్కనే హఠాత్తుగా ఒక ఫకీరు ప్రత్యక్షమై ఆ పిల్లవాణ్ణి ఎత్తుకుని అతని తలపై తమ చేతితో నిమిరి తిరిగి పడుకోబెట్టారు. ఆయనెవరోనని ఆ ఇంటిలోనివారు విచారించేలోగానే ఆ ఫకీరు అదృశ్యులయ్యారు. అది జూచి అలా తమకు దర్శనమిచ్చినది దయ్యమో భూతమోనని ఆ కుటుంబములోని వారంతా భయపడ్డారు. తర్వాత రేగే 1910లో శిరిడీ వెళ్ళినపుడు బాబా అతనిని ఆశీర్వదించి తమ ఫోటో ఒకటి ప్రసాదించారు. అతడు ఇంటికి తిరిగివచ్చాక ఆ ఫోటో తన తల్లికి చూపించాడు. అది చూడగానే ఆమె ఆశ్చర్యపడి, అతడు జన్మించిన 6వ రోజున తమకు దర్శనమిచ్చిన ఫకీరు వారేనని గుర్తించి ఆ సంగతి అతనితో చెప్పింది.

సేకరణ : శ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ గారి కృపాశీస్సులతో

 

 

 

Leave a comment

search previous next tag category expand menu location phone mail time cart zoom edit close