
హరి సీతారాం దీక్షిత్
ఈరోజు మనందరికీ సుపరిచితుడయిన సాయి సమకాలీన భక్తుడు కాకా దీక్షిత్జీవితం లో సాయి అడుగడుగునా ఎలా తన ఉనికి ని నిరూపిస్తూ ఎలాంటి అనుభవాలని కల్గించాడో చూద్దాము .
బాబాను అత్యంత భక్తి విశ్వాసాలతో సేవించిన వారిలో ఒకరు హరి సీతారాం దీక్షిత్. ఇతనిని బాబా ‘కాకాదీక్షిత్’ అని గాని, ‘కాకా’ అని గానీ పిలుస్తుండడంతో భక్తులలో గూడ అతనికి ఆ పేరే స్థిరమైంది. ఇతడు బొంబాయికి చెందిన ప్రఖ్యాత న్యాయవాది. భారత స్వాతంత్రోద్యమంలో లోకమాన్య బాలగంగాధర్ తిలక్ వంటి ఉత్తమ ప్రజా నాయకుల పై తెల్ల ప్రభుత్వం జరిపిన న్యాయ విచారణలోను, ‘పూణే వైభవము మొన ప్రఖ్యాత దేశీయ పత్రికల పై జరిపిన న్యాయ విచారణలోనూ యితడు ప్రముఖ పాత్ర వహించి దేశమంతటా కీర్తికెక్కాడు.
ఒకరోజు కాకాదీక్షిత్ స్నానం చేసి ధ్యానం చేసుకుంటుండగా అతనికి విఠలుని దర్శనమైంది. తర్వాత అతడు మశీదుకు వెళ్ళగానే, ” నీకు విఠల్ పాటిల్ సాక్షాత్కరించలేదా, అతడిట్టె తప్పించుకుపోతాడు జాగ్రత్త. నీ ధ్యాస త్రుటి సేపయినా చలించనివ్వక అతనిని గట్టిగా పట్టుకో!” అన్నారు. ఇది జరిగింది. ఉదయమే.. మధ్యాహ్నమయ్యేసరిగి ఆ విఠల దర్శనానికి సంబంధించిన మరొక విషయం లభించింది. ఎక్కడి నుండో విఠలుని చిత్రపటాలు అమ్ముకోడానికి ఒక వ్యక్తి శిరిడీ వచ్చారు. వాటిలోని విఠలుని చిత్రపటం సరిగా నాటి ఉదయం దీక్షిత్ కు దర్శనమిచ్చిన విఠలుని లాగానే వున్నది. అది అతనికెంతో ఆశ్చర్యం కల్గించింది. కాకా ఎంతో ప్రీతితో చిత్రపటం కొనుక్కొని తన పూజలో ప్రతిష్టించుకున్నాడు.
భాగవత పారాయణ పూర్తయ్యాక కాకా, ”బాబా, నన్నీసారి వ్యాఖ్యానాలతో గూడిన భగవద్గీత పఠించమంటారా?” అని అడిగాడు. బాబా వద్దు, నీవు భాగవతము, భావార్థ రామాయణాలే యింకా లోతుగా చదువు. ఇరికే చదివితే చాలదు. వాటిని బాగా మననంచేసి వాటి ప్రకారమాచరించు!”
ఒకసారి శిరిడీలో కాకాకు జ్వరమొచ్చింది. అపుడు బాబా, ”విల్లేపార్లేలోని నీ బంగళాకు వెళ్ళు. ఆ జ్వరం కొద్ది రోజులు మాత్రముంటుంది. తరువాత అదే తగ్గిపోతుంది భయంలేదు. నీవు మంచంలో పడుకోకుండా యథాప్రకారం రవ్వకేసరి తింటూ వుండు!” అన్నారు. అతడిల్లు చేరాక జ్వరం పెరుగుతుండడంతో డెమాంటే అను డాక్టరుకు చూపించారు. అతడు రోగిని మంచంలో నుండి కదలవద్దని చెప్పి మందులు వ్రాసియిచ్చాడు. కాని కాకా మాత్రం మందులేవీ వేసుకొనక, తన ఉయ్యాల బల్లమీద కూర్చొని, బాగా నెయ్యిపోసిన రవ్వకేసరి రోజూ తింటున్నాడు. అది చూచి ఆ వైద్యుడు నిర్ఘాంతపోయి, మరొక డాక్టరుతో కలిసి అతడిని పరీక్ష చేసి, అతడలానేచేస్తే ఎంతో ప్రమాదించగలదని హెచ్చరించాడు. కాకా అతనితో, ” మీరు కేవలం స్నేహితులుగా వచ్చి సరదాగా నాలుగు కబుర్లు చెబుతారని మిమ్మల్ని పిలిపించాను. బాబా చెప్పారు గనుక యీ జ్వరమెలాగో కొద్దిరోజుల్లో తగ్గిపోతుంది. మీకు మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ మాటరాదు లేండి” అన్నాడు.అతడొక ఫకీరువల్లో చిక్కి తెలివి తక్కువగా వ్యవహరిస్తున్నాడనుకున్నారు ఆ డాక్టర్లు. కాని త్వరలో జ్వరం తగ్గిపోయి 9వ రోజుకల్లా అతడు స్వస్థుడవడంతో ఆ వైద్యులిద్దరూ ఆశ్చర్యపోయారు.
ఒకసారి రూ. 25/- లు దక్షిణగా మరొకప్పుడు బాబాకు మాలవేసి సమర్పించాలనుకున్నాడు కాకా, అతడు మాలవేయగానే సాయి, ”ఈ మాల రూ. 25/- లు కోరుతోంది!’ అన్నారు., కాకా పరవశించి దక్షిణ సమర్పించాడు. మరొకరోజు అతడు ద్వారకమాయికి రాగానే బాబా, ‘ నీవీ రోజు నాకు అన్ని సేవలూ చేసావుగానీ తాంబూలమివ్వలేదేమి? వక్క, ఆకు యివ్వు” అని చేయి చాపారు. నిజమే… అతడా రోజు పూజలో తాంబూల మర్పించలేదు. ఆ సంగతి గుర్తొచ్చి వెంటనే అది సమర్పించుకొన్నాడు. సాయి తనను అనుక్షణమూ కని పెట్టి వున్నారని అతనికంతకంతకూ ధృవపడింది.
అంతేగాదు, ఒకరోజు కాకాకు నాగపూర్ లో అతని సోదరుడు జబ్బుపడ్డాడని జాబు వచ్చింది. అతడు వెంటనే ఆ జాబు బాబాకు చూపి, నా తమ్ముడు జాబు వ్రాసినా వాడికేమీ సహాయం చేయలేకపోతున్నాను!’ అని వాపోయాడు. అతడికి సహాయం నేను చేస్తాను!” అన్నారు బాబా. కానీ అతడికేమీ అర్థంగాలేదు. కొద్దిరోజుల తర్వాత మరొక జాబు వచ్చింది. సరిగా సాయి అలా అన్న సమయంలోనే నాగపూర్ లోని అతని తమ్మునివద్ద కొక సాధువు వచ్చి సేవచేసి జబ్బు తగ్గించి వెళ్ళిపోయాడని తెలిసింది. బాబా తమ భక్తులనేగాక వారి ఆప్తులను గూడ కాపాడుతారు.
(మిగితా భాగం రేపు చూద్దాము)
