
ఓం శ్రీ సాయినాధాయ నమః
బాబా యొక్క గొప్ప భక్తుడైన శ్రీ పేరూరు శర్మ గారి కుమారుడు శ్రీ ఫణి శంకర్ గారు తన తండ్రికి బాబా చూపించిన లీలను సాయి భక్తులతో ఇలా పంచుకుంటున్నారు
” 1996వ సంవత్సరంలో మా నాన్నగారికి సాయి చూయించిన లీల నేను ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను. నేను విజయనగరంలో 1996లో పనిచేయుచుండేవాడిని. మా నాన్నగారు కాకినాడలోని నివాసం ఉండేవారు. మా స్వగృహంలో మా నాన్నగారు నివసిస్తూ తన సమయాన్ని తన దగ్గరకు వచ్చే సాయి భక్తులతో గడుపుతూ ఉండేవాడు. ఒకరోజు “మా నాన్నగారికి గుండెపోటు వచ్చి పాక్షిక పక్షపాతంతో హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యాడు” అనే అత్యవసర సందేశం నాకు వచ్చింది. సందేశం అందిన మూడవ రోజు నేను అక్కడికి చేరుకుని రాత్రి 11 గంటల ప్రాంతంలో మా నాన్న గారితో మాట్లాడటం జరిగింది. అప్పుడు మా నాన్నగారు నాతో “రేపే నన్ను బాబా హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేస్తారు” అని చెప్పడం జరిగింది. నేను మా నాన్నగారి మాటలను అస్సలు నమ్మలేకపోయాను ఎందుకంటే ఆయన చాలా బలహీనమైన స్థితిలో ఉన్నారు. టాయిలెట్ కి కూడా లేచే పరిస్థితిలో లేరు. వారి చేతులు వణుకుతూ మాటలు చాలా అస్పష్టంగా మాట్లాడుతున్నారు. కాబట్టి ఆ మరుసటిరోజే బాబా గారు మా నాన్నగారిని డిశ్చార్జ్ చేసేలా చూస్తారు అనే వారి మాటలని నేను నమ్మలేకపోయాను.
మరుసటి రోజు ప్రాతఃకాలం ఐదు గంటలకి నేను మా నాన్నగారి రూమ్ లోకి వెళ్ళగా, తన రూమ్ లోని టాయిలెట్ నుండి వారు బయటికి వస్తు కనిపించారు.. క్రితం రోజు రాత్రి ఒంటి గంటలకు ఒకసారినన్ను టాయిలెట్ కి వెళ్లడానికి సహాయానికి పిలిచారు కానీ ఉదయం సహాయానికి రమ్మని నన్ను అడగకపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. 10 గంటలకు డాక్టర్ గారు వచ్చి మా నాన్నను చెక్ చేశారు. వారి పరిస్థితి చూసి ఆశ్చర్యపడిపోయి “ఇక మీరు మీ నాన్నగారిని ఇంటికి తీసుకెళ్లవచ్చు” అని నాతో చెప్పారు. నేను మా అన్నయ్య ఇద్దరం కలిసి ఆనందంతో మా నాన్నగారిని మా అన్నయ్య వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళాము. ఆ ఇంటి ఫస్ట్ ఫ్లోర్ లో మా అన్నగారి ఇల్లు ఉండుటచే మేము వారిని మెట్ల మీదుగా పైకి తీసుకెళ్ళాము. హాలులో ప్రవేశించగానే మా దృష్టి గోడ పైన గల బాబా చిత్రపటం పై పడింది. ఆ ఫోటోలో సాయి ని చూస్తుంటే, చిత్రంగా ఫోటోలోని బాబా దృష్టి మా నాన్నగారు ఉన్న వైపుకి తిరిగి మా నాన్నగారిని చాలా కోపంతో తీక్షణంగా చూస్తున్నట్లు ఉంది. మా నాన్నగారిని బాబా కొన్ని సెకన్ల పాటు అలా కోపంగా చూశారు.
మూడు రోజుల తర్వాత నేను కాకినాడ విడిచి విజయనగరం బయలుదేరుతున్న సమయంలో మా నాన్నగారు నాతో”హాలు లొ వున్న ఫోటో లో బాబా నన్ను చాలా కోపంగా చూశారు. ఎందుకో బాబా కి నా మీద కోపం వచ్చింది ” అని అన్నారు అప్పుడు నేను మా నాన్నగారితో, ” మీరు హాస్పిటల్లో ఎవరి సహాయం లేకుండా టాయిలెట్ కి ఎలా వెళ్లగలిగారు? ఆ మరుసటి రోజు నిన్ను బాబా డిశ్చార్జ్ చేస్తారు” అని మీరు అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలిగారు ” అని అడిగాను. దానికి మా నాన్నగారు తను ఎవరి సహాయం లేకుండా ఎలా టాయిలెట్ కి సొంతంగా వెళ్ళగలిగారో, ఆ మరుసటి రోజు బాబా తనను డిశ్చార్జ్ చేస్తారు అని ఎందుకు చెప్పారో తనకి అసలు తెలియదన్నారు. అప్పుడు నేను వారితో” బాబా మీ పట్ల కోపంగా లేరు. మీ రోగాన్ని బాబా అలా కోపంగా చూసి దహించి వేశారు అని చెప్పాను “.
ఈ విధంగా సాయి తన సజీవరూపమైన ఫోటో లో నుండి తన చూపు ద్వారా మా నాన్నగారి పక్షపాతాన్ని పోగొట్టి ఆయనని స్వస్థులని చేశారు. అలా మా నాన్నగారు 71 సంవత్సరాల వయసులో అంతటి అనారోగ్యాన్ని పొందిన కూడా బాబా వారి కృపతో తిరిగి మామూలు మనిషి అయ్యారు. బాబా గారి లీల ద్వారా బాబా తన అవతారాన్ని చాలించినా తనును నమ్మి కొలిచిన వారి బాగోగులని కనిపెట్టుకొని ఇప్పటికీ తన భక్తుల చుట్టూ సజీవంగానే ఉన్నారు అని అర్థమవుతుంది. “
హే సాయినాథ! మాకు నీ పై భక్తి విశ్వాసాలను పెంచి ప్రతి క్షణం మేము మిమ్మల్ని మర్చిపోకుండా ఉండగలిగే స్థితిని దయచేసి మాకు ప్రసాదించు. మా జీవితాలు మీ సేవలో కొనసాగే భాగ్యాన్ని ప్రసాదించు తండ్రి! మాయదారి మాయ మిమ్మల్ని మీ నుండి దూరంగా లాక్కోవాలని కాచుకుని కూర్చుంది. నీవే మాయబారి నుండి మమ్మల్ని కాపాడగల సర్వ సమర్థుడవు. మేము బలహీనులం ఆగుటచే మీ పాదాలని ఆశ్రయించాము. మమ్మల్ని ఉద్ధరించి భవసాగరమును తరింప చేసే బాధ్యత నీదే సాయి!”
శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై!
సాయి బంధువులకి మనవి. మీ అనుభవాలని సాయి భక్తులతో పంచుకోడానికి పేపర్ పైన అనుభవం రాసి తీసిన ఫోటో /వాట్సాప్ వాయిస్ మెసేజ్ /text మెసేజ్ రూపం లొ మాకు 7995901703 నెంబర్ కి పంపగలరు .
