ఓం శ్రీ సాయినాధాయ నమః
భక్తితో సమర్పించిన పత్రము కానీ జలము కానీ సాయినాధుడు ప్రేమతో స్వీకరిస్తారు.
1918 సెప్టెంబర్ 15 నాడు ఉదయం నాలుగు గంటలకు హేమాడ్ పంతు ఒక స్పష్టమైన స్వప్నం వచ్చింది. దబోలి లో నివసించే స్వామి విమలానంద స్వప్నంలో కనబడి వెండి నాణేలను ఇస్తూ, రేపు మధ్యాహ్నం 12 గంటలకు వంద లేత తమలపాకులు అర్పించు. ” అనే ఆదేశం ఇచ్చారు. హేమాడ్ పంత్ లేచి చుట్టూ చూడగా ఎవరూ లేరు. అక్కడ స్వామి గాని నాణేలు గాని కనిపించలేదు.
హేమాడ్ పంత్ ప్రతి సంవత్సరం గణపతిని ఇంట్లో ప్రతిష్టించి ఐదు రోజుల తర్వాత గణపతి నిమజ్జనం చేసే వాడు. ఈ స్వప్నం వచ్చిన రోజు కన్నా రెండు రోజుల ముందే గణపతి నిమజ్జనం జరిగింది. కాబట్టి ఇంట్లో ఏవైనా తమలపాకులు ఉండొచ్చు అని అతను ఆశించారు. తన భార్యని అడగగా, సుమారు 100 తమలపాకులు గల కట్టను తీసుకువచ్చి ఇచ్చింది. అంత దూరం దంభోళి వెళ్లి తమలపాకులు ఇవ్వడం అతనికి అసంభవంగా అనిపించింది. సకల సాదు స్వరూపుడైన సాయిబాబా విరాజిల్లే షిరిడీకి వెళ్లి బాబాకు తమలపాకులను సమర్పించాలని అతడికి తోచింది. కానీ ఆ తమలపాకులను షిరిడి కి తీసుకొని వెళ్ళేది ఎవరు? అని ఆలోచిస్తుండగా, ఎవరో వస్తున్నట్టు పాదాలా అలికిడి అయ్యింది. చూడగా అన్నా చించణీకర్ గుమ్మం ముందు కనిపించాడు. పట్టరాని ఆనందంతో హేమాడ్ పంత్ అతని ఇంటి లోనికి ఆహ్వానించాడు. అతడు అప్పుడే షిరిడి నుంచి వస్తూ హేమాడ్ పంత్ కి ఒక విభూతి పొట్లాన్ని ఇచ్చాడు. హేమంత్ అతడితో, “ఓ రెండు రోజుల్లో షిరిడి కి వెళ్లే వారు ఎవరైనా ఉన్నారా?” అని అడిగాడు. బాబాసాహెబ్ దేవ్ అనే భక్తుడు రెండు రోజుల్లో షిరిడీకి వెళ్ళబోతూన్నాడని అతను చెప్పాడు. వెంటనే హేమాడ్ పంత్ తమలపాకుల కట్ట, రెండు వక్కలు, 8 అణా ల నాణెము దేవ్ కి ఇవ్వమని అన్నా కి ఇచ్చాడు. మరుసటిరోజు అన్నా ఆ ప్యాకెట్ తీసుకుని థానే లోని దేవ్ ఇంటికి వెళ్ళాడు. అతడికి హేమాడ్ పంతు కి వచ్చిన స్వప్నం వినిపించి, బాబాకు సమర్పించమని ఆ తమలపాకులు దేవు కి ఇచ్చాడు.
దేవ్ శిరిడి వెళ్లడానికి బయలుదేర పోతుండగా, అదే రోజు తన కూతురు ఆరోగ్యం పాడవడం వల్ల, షిరిడి వెళ్లడానికి మరో 2 రోజులు వాయిదా వేశాడు. కానీ తమలపాకులను తాజాగా ఉంచడానికి ఎవరికి ఏ ఉపాయము తోచలేదు. కాబట్టి ఆ తమలపాకులు ఎండిపోయినవి.
తర్వాత షిరిడి వెళ్ల గానే అతడు నేరుగా ద్వారకామాయి లోనికి వెళ్లి బాబా కి హేమాడ్ పంతు సమర్పించమని ఇచ్చిన తమలపాకులను అర్పించాడు . తర్వాత ప్రారంభం నుండి షిరిడి చేరుకోవడం వరకు జరిగిన సంగతులన్నీ బాబాకు వినిపించాడు. బాబా తనకు అర్పించబడిన వస్తువులన్నిటినీ స్వీకరించాడు. ఆ నాణెం తన జేబులో వేసుకుని, తమలపాకులు మరియు వక్కలను తన పక్క పైనే ఉంచుకున్నాడు. ఎందరో భక్తులు తనకి సమర్పించిన పళ్ళు పూలు మిఠాయి లు, తమలపాకులను బాబా వెంటనే అందరికీ పంచేవాడు. కానీ ఎంతో భక్తితో హేమాడ్ పంతు అర్పించిన తమలపాకులను మాత్రం తన పక్క పైన పెట్టుకొని, “వీటిని ఇక్కడే ఉంచండి. ఏండి పోయిన ఈ తమలపాకులు నావి. కావున వీటిని ఇక్కడే ఉండనీయండి ” అని అందరికీ ఆదేశం ఇచ్చారు.
ఈ విధంగా భక్తితో సమర్పించిన ఎండిన తమలపాకులను కూడా సాయి స్వీకరించి హేమాడ్ పంతు ని ఆనందపరిచారు.
