ఓం శ్రీ సాయినాధాయ నమః
తమతో పాటు తమ సంతానాన్ని కూడా బాబా అనుగ్రహించాలని ఏ తల్లిదండ్రులైన కోరుకుంటారు. తమలాగే తమ సంతానం కూడా సాయిభక్తులు అవ్వాలని, బాబా మార్గములో పయనించాలనే కోరిక వారికుంటుంది. సాయి తన భక్తుల మనసులో ఉన్న కోరికను గ్రహించి కరుణతో, వారి సంతానాన్ని కూడా సన్మార్గంలో పెట్టి వారిని అనుగ్రహిస్తారు.
దామోదర్రాసనే కి పుట్టిన మొదటి కుమారుడు నానా సాహెబ్ రాసనే ఉరఫ్ దౌలత్ షా ఇలా చెప్పాడు.
“నా ఐదవ ఏట నాకు పుట్టు వెంట్రుకలు తీయించడానికి, అక్షరాభ్యాసం చేయించడానికి నన్ను శిరిడీ తీసుకువెళ్లారు, అప్పుడు బాబా నా చేయి పట్టుకుని పలక మీద ‘హరి ‘ మొదలైన అక్షరాలు వ్రాయించారు అటు తరవాత నన్ను షిరిడీ లో ఉన్న పాఠశాల వద్దకు తీసుకువెళ్లారు.
నా ఏడవ ఏట షిరిడీ లో ఒకరోజు బాబా పాదాలు వొత్తుతున్నాను. ఆ సమయంలో పిల్లలందరికీ బాబా మిఠాయిలు పంచ సాగారు. నా నా దృష్టి వాటిపైకి మరలి వారి పాదాలు వత్తడం మరిచిపోయాను. మా అమ్మ నన్ను రెండు దెబ్బలు కొట్టి, ‘నీవు బుద్ధి మిఠాయిల పై పెట్టి బాబా సేవ ను అశ్రద్ధ చేస్తున్నావు’ అన్నది. వెంటనే బాబా కోపంతో, ” ఇంకా పెద్ద దానివి. ఎందుకా పిల్లవాడిని కొడతావు? ” అని మందలించారు. మా తల్లి బాబా సేవ చేసే సద్బుద్ధి నాకు ప్రసాదించమని బాబా ను ప్రార్థించింది. అప్పుడు బాబా” ఈ పిల్లవాడు నా సేవ బాగానే చేస్తాడు. భగవంతుడు వీడికి కోరికలు అనుగ్రహిస్తాడు. భయం లేదు వాణ్ని కొట్టవద్దు ” అన్నారు.
నాకు యుక్త వయస్సులో నాలుగు పెళ్లి సంబంధాలు చూచారు. తర్వాత మా తండ్రి బాబా వద్దకు వెళ్లి నలుగురు కన్నెల జాతకాలు ఆయన ముందుంచి, వాటిలో ఏది నిశ్చయించుకొమ్మటారని అడిగారు. వాటిలో ఒక సంబంధం వారు సుమారు మూడు వేల దాకా కట్నం కూడా ఇస్తామన్నారు. కానీ బాబా వాటిలో నుండి అతి పేద కుటుంబానికి చెందిన జాతకాన్ని తీసి మా తండ్రికి ఇచ్చారు. నేను ఆమెని చేసుకున్నాను. నా వివాహానికి బాబాను పండరిపురం రమ్మని మా తండ్రి ఆహ్వానించారు. బాబా మా నాన్నతో, “నీవెప్పుడు తలుచుకుంటే అప్పుడే నీ చెంత ఉంటాను’ అన్నారు. మా తండ్రి ఇంకా ఒత్తిడి చేస్తుంటే ఆయన “భగవంతుని అనుమతి లేక నేనేమీ చేయలేను. నా తరపున శ్యామాను పంపుతాను ” అన్నారు. అలాగే నా పెళ్లికి శ్యామా వచ్చారు. నా తమ్మునికి కూడా బాబా ఆదేశించిన పేరే పెట్టారు.
నేను మహనీయుల అందరిని బాబా రూపాలు గానే దర్శించి నమస్కరించు కొనేటప్పుడు ‘సమర్ధ సద్గురు సాయినాధాయ నమః ” అనుకుంటాను. నేను 1927లో నారాయణ మహారాజ్ గారిని దర్శించినప్పుడు ఆయన, “నీ గురువు పరమగురువు. నా కంటే గొప్పవారు. నా వద్ద ఎందుకు వచ్చావు? నీ ప్రారబ్ద సంచితాలు అక్కడే ఉన్నాయి. నీ ఎన్నిక సాటి లేనిది. నీవు అక్కడికి వెళ్ళు. మీ లక్ష్యం సిద్ధిస్తుంది”. అ న్నారు నేను 1927లో నా గ్రహస్థితి ఆరోగ్యం బాగోలేనప్పుడు సీతారామ్ ఉత్తరేశ్వర్ లోని శివాలయానికి ప్రతి ఆదివారం వెళ్లి పూజించే వాడిని. ఒక ఆదివారం రాత్రి 9 గంటలకు నేను సాయిబాబా యనమః అంటూ శివలింగం మీద పువ్వులు ఉంచే సరికి దాని వద్ద ఒక వెలుగు, దానిలో బాబా రూపం ఇచ్చాయి. నాటి నుండి నా ఆరోగ్యం ధైర్య ఉత్సాహాలు కోలుకున్నాయి. ఒకసారి అక్కడ ఉన్న జానకి దాసు అను మహాత్మునికి నమస్కరించు కోగానే ఆయన నీవు ఆశ్రయించిన వారు గొప్ప మహాత్ములు. నా వంటి వారెందరో వారి పాదాలకు నమస్కరిస్తారు. నా వద్ద కొస్తావెందుకు? ” అన్నారు. నాటి రాత్రి కలలో నాకు ఒక ఫకీరు దర్శనమిఛ్చి , నీవు ఆందోళన పడుతున్నావు. నీ తండ్రికి చెప్పి, నీ శరీరము మనస్సు నాకర్పించు అన్నారు. నేను, ” ఇప్పుడే సమర్పించి తర్వాత మా తండ్రికి తెలుపుతాను ” అన్నాను. నీ తండ్రి అనుమతి తీసుకోకుండా, వాటినెలా సమర్పిస్తావు? అన్నారు బాబా. నేను “నా జీవితం నాది. నా తండ్రికి ఇంకా బిడ్డలు ఉన్నారు. ఆయనేమీ అభ్యంతరం చెప్పరు. ఆయనకు బిడ్డలను ప్రసాదించినది మీరే కదా!” అన్నాను. అప్పుడు బాబా నన్ను తమ చేతిలోకి తీసుకుని హృదయానికి దగ్గరగా జేబులో పెట్టుకున్నారు. నేను ఎంతో ఆనందించాను. నాకు మెలకువ వచ్చేసరికి నా మనసు వైరాగ్యము తో నిండి తృప్తిగా ఉన్నది. వెనకటి లాగా విషయ వాసనలు నన్ను బాధించటం లేదు. “

1 thought on “సాయి భక్తుల సంతానాన్ని కూడా ఉద్ధరించే బాధ్యత సాయి వహిస్తారు🙏”