మహల్సాపతి
సాయిబాబా సన్నిహిత సేవకులలో మొదటివాడయిన మహాల్సాపతి కి సాయి తో గల అనుభవాలు.
ఒకనాటి సాయంత్రం మహల్సాపతి ఇంటికి వెళ్ళడానికి సెలవు కోరగానే సాయి , “ఈరోజు నీకిద్దరు దొంగలెదురవుతారు, జాగ్రత్త ” అన్నారు. తరువాత అతనికి తన పక్క ఇంటి దగ్గర ఒక పాము, అతని ఇంటి గడప లో మరొక పాము కనిపించాయి. అతడు వాటినేమి చేయకుండా తప్పుకుని వెళ్ళిపోయాడు. అలానే మరొక రోజు సాయి అతనితో, “నీవు మల్లి వచ్చేప్పుడు దీపం తెచ్చుకో , మశీదు గేటు వద్ద దొంగ ఎదరవుతాడు” అన్నారు. ఆ తరువాత ఆయన చెప్పినట్లు చీకటి పడ్డాక అతడు లాంతరు తీసుకుని వస్తుంటే మశీదు గేటు వద్ద ఒక పాము ఎదురయ్యింది.
మరొకసారి బాబా అతనితో , “ఈరోజు ఖండోబా మందిరం లో ప్రమాదం జరుగనున్నది.అయినా భయం లేదు. నేనున్నాను.” అన్నారు. ఆరోజతడు ఖండోబా పూజ చేస్తుండగా అతని భార్య , కుమార్తె అకస్మాత్తు గా జబ్బుపడ్డారని కబురొచ్చింది. అయినా అతడు చలించలేదు అతడు మశీదు కి చేరగానే సాయి , “రోగులని మంచం లో నుండి కదలవద్దని చెప్పు ” అని చెప్పి మశీదు చుట్టూ తిరుగుతూ సటకా తో ఏదో అదృశ్య రూపాన్ని బెదిరిస్తూ , “రా, నీ శక్తి ఎంతో నేను చూస్తాను. నీవు వచ్చావో ఈ సటకా తో నిన్నేం జేస్తానో చూడు” అన్నారు. అదే ఆ రోగులకు బాబా చేసిన చికిత్స . ఆరోజు ఒక వైద్యుడు వచ్చి రోగులకు మందు వేయమన్నాడు. అయినా బాబా అనుమతించలేదు .అయినప్పటికీ కొద్దిసేపట్లో ఆ ఇద్దరికీ జబ్బు నయమయింది.
సకాలం లో మహాల్సాపతి కుమార్తెలకు వివాహాలయి కాపురాలకి వెళ్లారు. ఒకసారి ముగ్గురు మామగార్లు ఒక శుభ సందర్భం లో ఒక చోట చేరి మహాల్సాపతి ని కూడా రమ్మని కబురు చేసారు. నిజానికి వారెన్నడు అతనిని గౌరవించలేదు. కాబట్టి అతను సంతోషము తో ఊరుకి వెళ్ళడానికి అనుమతి ని కోరాలని మశీదు కి వచ్చాడు. అతడేమి చెప్పక ముందే బాబా , “నీవు వెళ్లదలచుకుంటే వెళ్ళు. కానీ వాళ్ళు నిన్ను కించపరుస్తారు”. అన్నారు. కానీ ఆడ పిల్లల తండ్రి గా అతడు వెళ్ళకతప్పలేదు . ఇతడు వెళ్లేసరికి అతడి కోసం కొంచమయిన వేచి చూడక ఆ ముగ్గురూ ఆనందంగా భోజనాలు చేసి చేతులు కడుక్కుంటున్నారు. అతనిని సరిగ్గా పలకరించలేదు కూడా. అతడెంతో చిన్నబుచ్చుకుని తిరిగి వచ్చాడు .
ఒకసారి మహాల్సాపతి కి ఖండోబా దివ్య దర్శనమిచ్చి పండరీపురం లోని విఠలుని దర్శించమని ఆదేశించాడు. ఇంట్లో తిండి కూడా గడవని అది తనకెలా సాధ్యమో మహల్సాపతి కి అర్థం కాలేదు.కానీ కొన్నిరోజుల్లో ఒక శ్రీమంతుల కుటుంబం అతన్ని పండరి పంపించారు. అక్కడ జనం ఎక్కువ గా వున్నారు. విఠలుని దర్శనానికి పూజారులు కోరిన కాసులు తన వద్ద లేవు. అతడెంతో కష్టపడి జనం లో తోసుకుంటుంటే, అతడి ముఖం లో ఆ పూజార్లకి ఖండోబా దర్శనమైంది . వారు వెంటనే అతన్ని విఠలుని దర్శనం చేయించారు. అలానే అతడొకసారి కొందరు భక్తులతో కలిసి జాజూరి యాత్ర కి వెళుతుంటే, పోలీసులు వారి పాస్ లు చూయించమని అడిగారు. ఒకరివద్ద మాత్రం అది లేదు. గ్రామ కరణం వద్దకి వెళ్లి తీసుకురావడానికి వెళ్లగా, అతడు ముందు తన ఇంట కట్టెలు కొట్టమని చెప్పి గొడ్డలి ఇచ్చాడు. అతడు కట్టెలు కొట్టబోగానే ఆ గొడ్డలి విరిగింది. అది ఖండోబా లీల అని గుర్తించి ఆ కరణం అతడికి పాస్ ఇచ్చి పంపేశాడు.
సేకరణ: “సాయి సన్నిధి” పుస్తకం నుండి
