దొరికిన డబ్బు
శ్రీ శ్రీ శ్రీ అఖిలాండకోటి బ్రహ్మాన్డ నాయక సమర్ధ సద్గురువు సాయి బాబా ఆశీస్సులతో ,వారి పాదపద్మములకు నమస్కరించి అమ్మనబ్రోలు గ్రామము సాయి భక్తులలో ఒకరైన వావిలాల కృష్ణమూర్తికి జరిగినటువంటి బాబాగారి యొక్క లీల, దృష్టాంతములు తెలియజేయుచున్నాము.
“మా గ్రామములో 27-1- 1999 తేదీన బుధవారం శ్రీ షిరిడీసాయిబాబాగారి యొక్క విగ్రహ ప్రతిష్ట పూజ్యగురువులు శ్రీ శ్రీ శ్రీ సాంబశివరావు గారిచే జరిగినది. 26-1-99 తేదీన మంగళవారం రాత్రి 12 గం. సమయంలో రూ 18000రూలు పాకెట్ జేబులో పెట్టుకొనుచు, ప్రతిష్ఠా కార్యక్రమములో నిమగ్నుడనై ,నా సొంతడబ్బు 7,800 పాకెట్ దేవాలయ ప్రాంగణములో వదిలిపెడితిని. తరువాత ప్రతిష్ట జరిగిన తరువాత రోజు నా పాకెట్ చూసుకొంటిని. నా డబ్బు కనబడలేదు. ఆ డబ్బు ప్లాస్టిక్ కవరులో సాయిబాబాగారి ఫొటోతో ఎల్లప్పుడు నా దగ్గర ఉంటుంది. అంతకన్నా నా దగ్గర పైసలు లేవు. చాలా బాధపడితిని. 16రోజులు పండగ స్వామివారికి ఎలా జరుగునా అని బాధపడితిని. ఏ విధమైనటువంటి ఆచూకీ దొరకలేదు. మరలా నిత్యము నైవేద్యము 3 రోజులు వరుసగా పెట్టవలసి వచ్చినది. డబ్బు పోయినదనే బాధతో,”స్వామి, నేను సంపాదించిన డబ్బు యావత్తూ రూ.50,000 నిత్య నైవేద్య దీపారాధన కోసంగా నీ (బాబాగారి) పేరుతోనే డిపాజిట్ చేసి ఉంటిని. ఈ డబ్బు (7,800) పోయినది. ఇంకా రూ. 6000 దేవాలయం ఖర్చులకు ఉంచితిని. నేను ఏమి పొరపాటు చేశానని నాకు ఈ శిక్ష విధించావ”ని బాబాగారిని అడిగినాను. ఇలా రెండు రోజులు దుఃఖించితిని. 10-2-99 వ తేదీన బుధవారం పగలు 11గం.స్వామి వారికి నైవేద్యము చెల్లించుటకు మహానైవేద్యము, పూలు వగైరాలు బుట్టలో పెట్టుకొని దేవాలయమునకు వెళ్ళుచుంటిని .ఆ సమయములో నాకు ఎడమచేతి వైపున శివాలయము ప్రహారీగోడ కలదు. దాని ప్రక్కన చెట్లు మొ. ఉన్నవి. అక్కడ ఒక మనిషి ఎవరో నిలుచొని ఉన్నారు. నేను పరిశీలనగా చూడలేదు. దేవాలయమునకు (బాబాగారిమందిరము) వెళ్ళి మహానైవేద్యము చెల్లించి తిరిగి వచ్చునపుడు ఆ రూపము అక్కడే ఉంది. నాకు వంగి ఉన్నట్లుగా కనిపించినది. కనిపించి ఎటో వెళ్ళిపోయినది. నేను ఆ రూపము ఉన్నచోటికి వచ్చి నిలుచుంటిని. మనుష్యులు ఆ దారిన అటూ ఇటూ పోవుచున్నారు. ఆ వ్యక్తి వెళ్ళినచోట నా కవరు, డబ్బు, బాబాగారి ఫోటో కనిపించినవి. దానిలో రూ 800/- పోయినవి ..మిగిలిన పైకము ఉన్నది. భక్తుల బాధలు తీర్చే మన సాయినాధుని దయ తో, శ్రీ శ్రీ శ్రీ అమ్ముల సాంబశివరావు గారి దయతో ఈ మహిమ జరిగినది.”
వి. కృష్ణమూర్తి.
అమ్మనబ్రోలు.
